13, ఏప్రిల్ 2012, శుక్రవారం








              ఆమెకు 76  అమె పాటకు 54 

1938 ఏప్రియల్  23 న  ఒక చిన్నారి కోయిల  గుంటూరు  జిల్లా రేపల్లె తాలుకాలో
పల్లపట్ల  గ్రామంలో పుట్టింది .తండ్రి శ్రీరామమూర్తి . శిష్ట్లవారి వంశంలో ఆరుగురు అక్క 
చెలెల్లు ముగ్గురు అన్నదమ్ముల మధ్య నాల్గవ సంతానంగా  చిన్నారి కోయిల పుట్టింది.
ఆ  చిన్నారి కోయిలే యస్ .జానకి. అందరు బాగా చదువుకున్నవారే. కాని 
జానకికే చదువు ఇష్టంలేదు. ఎప్పుడు పాటల  ధ్యాసే . రేడియో లో పాటలు శ్రద్దగా 
వినేది.జానకి కుటుంబం కొంతకాలం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల లోను ,రాజమండ్రిలోను 
నివాసం ఉన్నారు.రాజమండ్రిలో శ్రీ గొడవల్లి పైడి స్వామి వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ
తీసుకున్నారు.లతా మంగేష్కర్ ,ఆశాభోసలె  పాటలు బాగా వినేవారు. ,రాజమండ్రిలో
వి.రామచంద్ర రావు (సిని దర్శకులు)ఆధ్వర్యంలో క్రాంతి కళా మండలి అనే సంస్థ ఉండేది.
అందులో కే .యల్.నరసింహారావు,పంపన సూర్యనారాయణ,జానకి పాటలు పాడేవారు.
ఒకసారి విజయనగరం లో పి.సుశీల ఆలపించిన చందన చర్చిత అష్టపతి జానకి పాడితే 
సుశీల తండ్రిగారు వచ్చి మెచ్చుకున్నారు.
      అప్పట్లోనే తల్లి మరణించగా అక్క దగ్గరకు హైదరాబాదు వెళ్లారు.బావ జి.నరసింహారావు 
ఫన్ డాక్టర్  వి.చంద్ర శేఖర్ గారికి పరిచయం చేసారు.(ఆయనే ఆ తర్వాత ఆమెకు మామగారు 
అయ్యారు.) ఆయన ఫన్ ప్రదర్శనలు ఇస్తుంటే  మేకప్ మార్చుకునే సమయంలో పాటలు 
పాడుతుండేది .  లతగారి నిదురపోరా తమ్ముడా  మేరా దిల్ ఎ పురారే మొదలైనవి పాడేది.
చంద్ర శేఖర్ గారి అబ్బాయి రాంప్రసాద్ ప్రోత్సాహంతో ఎ.వి.యం. స్టుడియోలో స్టాప్  ఆర్టిస్ట్ గా 
చేరారు. కాని వారికి మొదటి పాట పాడలేదు.4 -4 - 57  లో  టి.వి.చలపతి రావు గారి సారధ్యంలో
తమిళ పాటలు రెండు పాడారు.ఆ మరుసటి రోజే పెండ్యాల   గారి సారధ్యంలో  యం.యల్.ఎ.చిత్రం
 కోసం ఘంటసాల గారితోకలసి "నీఆస అడియాస నీ దారే మణిపూస "అనే  పాట పాడారు.ఈ
 మూడు పాటలు విషాద గీతాలే. తమిళ సినిమా విడుదల కాక పోవడంతో తెలుగు పాటే
 మొదటి పాట అయ్యింది.ఆ తర్వాత నీలి మేఘాలలో  గాలికెరటాలలో" పాట బాగా పాపులర్
 అయ్యింది. దానితో బాగా బిజీ   అయ్యింది.
        " మురిపించే మువ్వలు" చిత్రం కోసం పాడిన "నీలీల పాడేద దేవా "పాట మొదట తమిళం
 చిత్రం"కొంజుం సలంగై"లో "సింగార వేలనే  దేవా " అని  జానకి పాడింది.అది దక్షిణ దేశాన్ని ఒక
 ఉపుఉపింది.తెలుగులో కూడా అంతే.దానిలో సుబ్బారాయుడి గారి ప్రతిభే ఎక్కువ. విద్వాన్  కురిచ్చి 
అరుణాచలంగారు  నాదస్వరం వాయించారు. ఆపాట పాడటానికి మద్రాసులో గాయనిమణులు
దొరకక బొంబాయిలోకూడా వెదికారుట. అక్కడ కూడా దొరక్క మళ్ళి  మద్రాసులోనే వెదుకుతుండగా  
పి.లీల గారు జానకి చే పాడించ మన్నారుట. విచిత్రం ఏమిటంటే జానకికి తమిళంలో 2
సంవత్సరాల దాకా అవకాశాలు రాలేదు.
     "పగలే వెన్నెల" "నడిరేయి ఏజాములో" "పగలైతే దొరవేరా " "జనని వరదాయనీ "
 "కొండలన్నీ తిరిగెను కోనలన్నీతిరిగెను " వంటి మంచి పాటలు పాడారు.మొత్తం 17 భాషల
లో 17 వేల పాటలు పాడారు.అందులో 
ఇంగ్లీష్ ,జర్మన్,జపాన్ భాషలు కూడా ఉన్నాయి. 17 వేల పాటలలో 15 వేలపాటలు సినిమా పాటలు 
కాగా మిగతావి ఆల్బమ్స్ . తెలుగులో కన్నా తమిళ ,మలయాళ పాటలే ఎక్కువగా పాడారు.
కన్నడంలో పి.బి.శ్రీనివాస్ తో ఎక్కువ పాటలు పాడారు.
    కన్నడంలో "హేమవతి"చిత్రానికి యల్ .వైద్యనాధన్ గారి సంగీతంలో  అభేరి,తోడి రాగాల
 సమ్మేళనంగా ఒక లైన్ అభేరి ఒక లైన్ తోడి రాగాలతో "శివ శివ యన్నద నాళిగ  ఏకే "అనే 
ఒక పాట పాడటం జరిగింది .   ముత్యాల పల్లకిలో  బాల మురళి కృష్ణ గారితో 5 రాగాలతోను, బిస్మిల్లా 
ఖాన్  షేహానాయితోను, నామగిరి పేటై క్రిష్టన్ నాద స్వరం తోనూ,హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్
 తోనూ  తెలుగు ,మలయాళం లోను పాటలు పాడారు.మొదటి పాట పెండ్యాల గారి సారద్యంలో 
ఘంటసాల గారితో పాడగా ఘంటసాల  గారు   పెండ్యాల గారి సారద్యంలో జానకితో "నాన్న అనే
 రెండు అక్షరాలూ " గారు తన  చివరి పాట పాడారు . ఈ పాటపాడి ఘంటసాల గారు భోరున 
ఏడ్చారుట. నా తర్వాత నా పిల్లలు ఈ పాట పాడుకుంటారు అన్నారుట .
      " పువ్వులు పూయును పదివేలు"  "గున్న మామిడి కొమ్మమీద "  "మనసాతుళ్ళి పడకే "
"కలల అలలపై " "మేఘమా దేహమా " "ఈ దుర్యోధన దుశాసన " 'సిరిమల్లె పూవా " పాటలంటే 
ఇష్టం . పి.లీల,మహమ్మద్ రఫీ పాటలంటే ఇష్టం .ఎ .పి .కోమల పాడిన "పదములే చాలు రామా "
"రతిసుఖ సారే"పాట లంటే ఇష్టం .ఒకసారి మద్రాసులో ఒక పంక్షన్ లో పాడుతుండగా  అక్కడి 
పిల్లలు బోర్ ఫీల్అవుతుంటే వారికోసం చిన్న పిల్ల లాగా పాడింది . అక్కడే ఉన్న ఒక తమిళ్ 
నిర్మాత తన సినిమాలో ఆమెతో చిన్న పిల్ల లాగా పాడించుకున్నాడు.ఆ తర్వాత చాలా పాడింది.
"చందమామ రావే"  "జడ్జిమెంట్ " సినిమాలలో బేబి సుజితకు డబ్బింగ్ చెప్పింది. 
"మౌన పోరాటం " చిత్రానికి సంగీత దర్సకత్వం వహించింది .
త్యాగరాజ కీర్తనలు,సూరదాసు,కబీర్ దాసు,మీరా భజనలు, కృష్ణ రవళి, నాద ప్రవాహం ,పి.బి.శ్రీనివాస్ 
తెలుగు భక్తీ గీతాలు ,అయ్యప్పగితికాష్టకం ,శ్రీ వెంకయార్య సుప్రభాతం ,శ్రీ షిర్డీ గితమాలిక మొదలగు 
వాటికి సంగీతం సమకూర్చారు .అసలు చదువే లేని జానకి పాటలు కుడా వ్రాసారు. తమిళంలో 
"కన్నా నీ ఎంగె "పాట రాసి పాడారు.దానినే తెలుగులో "కృష్ణా నీ వెక్కడా "అంటూ అనువాదం చేసి 
 ప్రియా పచ్చళ్ళ కు అడ్వర్ టైజ్ మెంట్  పాటగా పాడారు.
            4 సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు ,తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషలలో 
ఉత్తమ నేపద్యగాయనిగా ఎన్నుకోబడ్డారు . ఆమె ఎంత ఎత్తు ఎదిగినా భర్త చాటు భార్యే .రాంప్రసాదుతో 
ప్రేమ వివాహం . పారితోషికాలు ,రాయల్టిలు,డబ్బు వ్యవహారాలు అన్ని రాం ప్రసాదు గారే చూసుకునేవారు .
అత్తగారు ,మామగారు ,భర్త ఇచ్చిన ప్రోత్సాహంతోనే కెరీర్ కు ఇబ్బంది లేకుండా గడిచి పోయింది .
          ఆమెకు ఒక కొడుకు మురళి కృష్ణా.కోడలు ఉమా .మురళి కృష్ణ కొన్ని సినిమాలలో నటించాడు .
కోడలు డాన్సర్ .    రాంప్రసాద్ గారికి మొదటిసారి  గుండె నొప్పి వచినప్పుడు  హాస్పటల్ లో జాయిన్
చేసిన రోజున జానకి గారికి రికార్డింగ్స్ ఉన్నాయిట.తప్పని సరి పరిస్తితిలో  కార్తిక్ దీపం చిత్రం కోసం
 " నీచేతులలో తలవాల్చి"పాటను ఆయనను తలచుకుంటూ పాడారు.కాని  విదివైపరీత్యం ఆయనే
 ముందు చని పోయారు. ఆతర్వాత  ఆమె కొన్ని పాటలు పాడిన  క్రమంగా పాటలు తగ్గించారు.
ఈ మధ్యనే ఆమె పడిపోయి తలకు దెబ్బతగిలి చికిత్స చేయించుకొని కోలుకుంటున్నారు.వారు
కలకాలం చిరంజీవిగా జీవించాలని కోరుకుంటూ జానకిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము.        




2 కామెంట్‌లు:

  1. గానకోకిల ఎస్.జానకిగారి గురించి చాలా వివరములు తెలిపినందుకు సంతోషం.

    ఆమె తెలుగులో పాడిన మొదటి పాట "నీ ఆశా అడియాసా! నీ దారే మణిపూసా!' అని పేర్కొన్నారు. "చెయిజారే మణిపూసా" అని ఉండాలి; గమనించగలరు.

    రిప్లయితొలగించండి